విజయనగరం ఉత్సవాల నేపథ్యంలో గురజాడ జంక్షన్ వద్ద పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పెంపుడు జంతువుల ప్రదర్శన ఆసక్తిదాయకంగా సాగింది. పశుసంవర్ధక శాఖ జరిగిన ఈ కార్యక్రమానికి సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. పలు జాతులకు చెందిన శునకాలు, కుందేళ్లు, కోళ్లు, పుంగనూరు ఆవులు వయ్యారి నడకలతో ఆహుతులను అలరించాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ దీపికా ఎం. ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువులు చేసిన ప్రదర్శనలను ఎస్పీ వీక్షించారు.
ల్యాబ్రాడర్ రిట్రైవర్, గోల్డెన్ రిట్రైవర్, జర్మన్ షెపార్డ్, గ్రేట్ డేన్, డాబర్ మెన్, డాల్మేషన్, సెయింట్ బెర్నార్డ్, బాక్సర్, సైబీరియన్ హస్కీ, ఫ్రెంచ్ బుల్ డాగ్ తదితర 100 రకాల డాగ్స్ వయ్యారి నడకలతో సందర్శకులను ఆకట్టుకున్నాయి. కడక్ నాధ్, జపనీ పాటమ్ తదితర జాతుల కోళ్లు, మీనియేచర్ జాతికి చెందిన పుంగనూరు ఆవులు, లవ్ బర్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యాయ నిర్ణేతలుగా డా. శ్రీధర్, డా. చంద్రశేఖర్ వ్యవహరించారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి , జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాల సందర్భంగా డాగ్ షో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానవుని జీవితాలలో కుటుంబ సభ్యులుగా శునకాలు నేడు పరిపాటి ఆయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ వైవి రమణ, అదనపు సహాయ సంచాలకులు డా. రామ్ ప్రసాద్, ఇతర వైద్యాధికారులు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రదర్శనను వీక్షించేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు.