రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం 30శాతం మంది ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగి ఉన్నారని, ఇలాగే కొనసాగితే అనతికాలంలోనే సభలో నేర చరిత్ర ఉన్నవారే ఎక్కుగా ఉంటారని పేర్కొన్నారు.నేరచరిత్రులకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్ కోరారు. విద్యావంతులు, ఎలాంటి నేరచరిత్ర లేని, ప్రజలకు సేవ చేసేవారికి, పేద, మధ్య తరగతి వారికి టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నేరచరిత్రులకు టికెట్ ఇవ్వాలనుకుంటే అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను వెబ్ సైట్లో పెట్టాలని, నామినేషన్ తర్వాత అభ్యర్థి, పార్టీ స్థానికంగా ఉన్న పత్రికల్లో, టీవీ ఛానళ్లలో నేచరిత్రపై తెలపాలని సుప్రీంకోర్టు డబ్ల్యూపీ సంఖ్య 536, 2018 సెప్టెంబర్ 25న వెల్లడించారని, రాజకీయపార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో సుప్రీం నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.