NH-06 పై అస్సాంలోని సెక్టార్ సిల్చార్లోని డెప్త్ ఏరియాలో సరిహద్దు భద్రతా దళాలు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం 17000 యాబా టాబ్లెట్లు బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లటి రంగు ఆల్టో కారులో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని BSF ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు మేఘాలయ వైపు NH-06పై కటిగోరా – కలైన్ రోడ్లో బిఎస్ఎఫ్ నిఘా వేసి ఉంచింది.
27వ తేదీ తెల్లవారు జామున అనుమానాస్పద కారు తారస పడగానే బిఎస్ఎఫ్ అప్రమత్తం అయింది. తెల్లవారు జామున రెండున్నర గంటలకు యాబా ట్యాబ్లెట్ తో వెళుతున్న ఆ కారును పట్టుకున్నారు. కటిగోరా – కలైన్ రోడ్ (NH-06)లో హిలారా రైల్వే క్రాసింగ్ సమీపంలో జాయింట్ ఆపరేషన్స్ పార్టీ అనుమానాస్పద ఆల్టో కారును అడ్డగించింది.
ఆల్టో కారును శోధించగా, ఎడమ తలుపు (వెనుక వైపు) లోపల దాచిపెట్టిన అనుమానిత యాబా టాబ్లెట్లు కనిపించాయి దాంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ – రూ. 1,72,07,000/- వరకూ ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్య కోసం కరీంగంజ్ కస్టమ్స్ డివిజన్ ప్రతినిధికి అప్పగించారు.