ముకేష్ అంబానీ రికమెండేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో రాజ్య సభ సీటు దక్కించుకోవాలని చూస్తున్న రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని సీటు ఖరారు అయితే పి వి పికి కోత పడే అవకాశం ఉంది. పొట్లూరి వర ప్రసాద్ (పి వి పి) కి రెండు నెలల కిందట వైసిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు.
దాంతో రాజ్యసభ సీటుపై ఆయన ఆశలు పెరిగిపోయాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి ఒకరికి రాజ్యసభ స్థానం కల్పించాలని ముందు నుంచి భావిస్తున్న వై ఎస్ జగన్ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి స్థానం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అయితే చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇస్తే అటు ఆయన పరుపు, తన పరువు పోతుందని కొందరు సలహా ఇవ్వడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు.
అప్పటికే పి వి పికి హామీ ఇచ్చినందున పి వి పికి రాజ్య సభ సీటు ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని జగన్ అనుకున్నారు. పి వి పిని రాజ్యసభ కు పంపితే వల్లభనేని వంశికి విజయవాడ పార్లమెంటు సీటు భవిష్యత్తులో ఖరారు అవుతుంది. వంశి చేరడంతో ఇరకాటంలో పడ్డ గన్నవరం వైసిసి నాయకుడు వెంకటరావు కు భవిష్యత్తులో ఆ స్థానం ఇచ్చేసే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఆంధ్రాలో పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుందని జగన్ అంచనా వేసి పి వి పిని రాజ్యసభకు పంపుదామని అనుకున్నారు. అయితే మధ్యలో ముకేష్ అంబానీ దూరడంలో పి వి పి ఇక చాప చుట్టాల్సిందేనని అంటున్నారు.