రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు ఎదిగిన ఈ కాలంలో కూడా మనుషుల్లో మూఢనమ్మకాలు ఉండటానికి కారణం శాస్త్రీయ దృక్పథం కొరవడటమేనని తెలంగాణ రాష్ట్ర మానవ వికాస వేదిక నాయకులు తుమ్మ భాస్కర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పాత బస్టాండ్ సమీపంలో సూర్యగ్రహణం సందర్భంగా మానవ వికాస వేదిక అనే హేతువాద సంఘం నాయకులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
చంద్ర గ్రహణం కానీ సూర్య గ్రహణం కానీ ప్రకృతిలో నియమానుసారంగా అద్భుతంగా జరిగే సంఘటనలే అని సంఘ నాయకులు విశ్రాంత అధ్యాపకుడు రంగారావు అన్నారు. సూర్య గ్రహణం అనేది భూమికి సూర్యునికి మధ్యలో ఒకే సరళరేఖ లోకి చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడుతుందని ఆయన వివరించారు.
గ్రహణం సందర్భంగా ఎటువంటి మూఢాచారాలను పాటించటం అవసరం లేదని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం వలన ఏమీ కాదని సూర్యాపేట జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి గూడా నర్సింహారావు అన్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడటం వలన గ్రహణ మొర్రి ఇలాంటివి రావని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హేతువాద సంఘం నాయకులు అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల రామాంజనేయులు, తిరుమల రావు,శ్రీనివాస్, పున్నా ప్రసాద్ పాల్గొన్నారు.