పట్టణ కేంద్రాలలో ఉపాధి హామీ పనులను కల్పించి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోషనబోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హుజూర్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ యాకూబ్ పాషా కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో అనేక మంది పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలలో కల్పించటం ద్వారా పేదలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. గ్రామాలలో పనులు లేకపోవడంతో పేదలు పట్టణాల్లో పని కోసం రావడంతో పని దొరకక పోవడంతో పట్టణ పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే అన్ని మున్సిపాలిటీలలో పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాసాని వీరస్వామి, రేపకుల వీరస్వామి,శీలం శ్రీను,పిట్టల నాగేశ్వరరావు,వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్