తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య
తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో మాతా రామాబాయి అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య మాతా రామాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ మాతా రామాబాయ్ అంబేద్కర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. పేడ పిసికి పిడకలు కొట్టి తన భర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుల కోసం డబ్బులు పంపించింది అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద పెద్ద చదువులు చదవడానికి ముఖ్య కారణం మాతా రమాబాయి అంబేద్కర్ అని అన్నారు.
కటిక పేదరికం అనుభవిస్తూనే తన కడుపులో పిల్లల్ని పోగొట్టుకున్నా తన జాతి బిడ్డల ప్రయోజనాల కోసం సర్వం త్యాగం చేసిందని అన్నారు. తన భర్త అంబేద్కర్ ఈ సమాజంలో ఉన్న అంటరానితనం కుల వివక్షత సమసమాజ నిర్మాణ పోరాటంలో ఏనాడు అడ్డు తగలకుండా తన భర్తకు ఎంతో ప్రోత్సాహం గా ఉండి జాతి ప్రయోజనాల కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగధనరాలు మాతా రమాబాయి అంబేద్కర్ అని తెలిపారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతి చేసిన సేవలు, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. రిజర్వేషన్లు, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి దాని వెనుక మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగం ఉందని తెలిపారు. ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఈ జాతి ఆమె అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మంగి చలపతి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా యువత అధ్యక్షులు ఏనుపోతుల కర్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పాశం రాకేశ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అజిత్ కుమార్, జిల్లా సీనియర్ నాయకులు గుంత లక్ష్మయ్య, తోళ్ళ మాసయ్య, డాక్టర్ కేశవ్, రమేష్, పెంటయ్య మరియు రాజు తదితరులు పాల్గొన్నారు.