బిచ్కుంద మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో చెన్నూరు చెరువులో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. అయితే పక్కనే ఉన్న రామిరెడ్డి అనే రైతు తనకు రెండు ఎకరాల ఇరవైదు గుంటల భూమి ఉందని ఇక్కడ తవ్వడానికి వీలులేదంటూ కూలి పనులను అడ్డుకున్నారు.
దీంతో కూలీలు రైతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై సత్యంన్యూస్ తహశీల్దార్ వెంకట్రావు ఫోన్ లో వివరణ కోరగా తాను గిర్దావర్, సర్వేయర్లను పంపి సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. చెరువులో ఎవరు పంటలు వేసినా శిక్షార్హులేనని ఉపాధి పనులను అడ్డుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. పనులు సాగనివ్వక పోవడంతో 270 మంది కూలీలు వెనుదిరిగారు.
ఈ చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల 21గుంట ఉంది. డెబ్బై ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. కానీ కొందరు కబ్జాదారులు చెరువును కబ్జా చేయడంతో చెరువు రూపు మారిపోయింది. దీనిపై సంబంధిత రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువులో కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.