గత ఏడాది దేశంలో అత్యంత సంచలనం కలిగించిన నేరం ఏమిటంటే ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య. ఈ హత్య సాధారణమైన నేరం కాదు. అత్యంత కరడుకట్టిన నేరస్తుడు చేసిన మాదిరిగా ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అనేవారు శ్రద్ధను హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని 34 భాగాలుగా నరికి అడవిలో పడేశాడు. జరిగిన ఈ నేరం బయటకు రాగానే దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసిన తీరు అందరినీ కలచివేసింది.
ఈ హత్య అంశాలను చూపించడం ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్లు పరోక్షంగా లాభపడి ఉంటాయి. హత్య అంశాలను తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. ఒక జాతీయ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ వారు ఒక అడుగు మందుకు వేసి కల్పిత పాత్రలతో ‘క్రైమ్ పెట్రోల్’లో ఒక ఎపిసోడ్ రూపొందించారు. దాని కంటెంట్కు సంబంధించి చాలా కలకలం రేగింది. ఆ తర్వాత సోనీ టీవీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిపై సోనీ టీవీ ట్విట్టర్లో క్షమాపణలు చెప్పింది.
సోనీ టీవీ ఎందకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో చూస్తే మరింత ఆసక్తి కలుగుతుంది. ఈ ‘క్రైమ్ పెట్రోల్’ ఎపిసోడ్ కు ‘అహ్మదాబాద్-పూణే మర్డర్’ అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్లో శ్రద్ధను అనా ఫెర్నాండెజ్గా చూపించగా, అఫ్తాబ్ను మిహిర్ అనే హిందూ అబ్బాయిగా చూపించారు. మిహిర్, అనా ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఎపిసోడ్లో చూపించారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చంపేశాడని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో శ్రద్ధా, అఫ్తాబ్ పేర్లు మార్చడమే కాకుండా అబ్బాయికి హిందువు పేరు పెట్టడాన్ని పలువురు విమర్శించారు.
దాంతో సోనీ టీవీ స్వయంగా ముందుకు రావాల్సి వచ్చింది. దీనిపై సోనీ ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టి క్షమాపణలు చెప్పింది. అలాగే, ఈ ఎపిసోడ్ అన్ని OTT ప్లాట్ఫారమ్ల నుండి తొలగించారు. వీక్షకుల మనోభావాలను గౌరవిస్తాం. వీక్షకుల మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి అని అందులో పేర్కొన్నారు.