ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాకు అవినాభావ సంబంధం ఉంది.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రారంభం అయిన నాటి నుంచి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా ఈ మధ్య కాలంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దూరం అయ్యారు.
ఆనాటి నుంచి జబర్దస్త్ ప్రోగ్రామ్ రేటింగ్స్ పడిపోవడం ఆరంభం అయింది. కొత్తగా న్యాయ నిర్ణేతలుగా కొందరిని తీసుకువచ్చినా ఆ ప్రోగ్రామ్ పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు.
రోజా లేకుండా ఆ కార్యక్రమాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉందంటూ ఈ టీవీ ప్రేక్షకులు వ్యాఖ్యానాలు ప్రారంభించారు.
దాంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించే మల్లెమాల వారు రోజాను మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
శస్త్ర చికిత్స చేసుకున్న రోజా కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మల్లెమాల సంస్థ వారు కోరడంతో ఆమె మళ్లీ సెట్స్ పైకి వచ్చారు.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు రోజా రాకపోవడంతో రేటింగ్స్ లో కనిష్ట స్థాయికి చేరుకోగా మళ్లీ ఆమె కనిపించడంతో కొత్త ఊపు కనిపించింది.
ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి న్యాయనిర్ణేతలుగా రోజా, నాగబాబు వ్యవహరించేవారు. అయితే నాగబాబు కార్యక్రమం నుంచి నిష్క్రమించినా కార్యక్రమానికి గ్లామర్ తగ్గకుండా రోజా ప్రయత్నించారు.
దాంతో నాగబాబు నిష్క్రమించిన ఎఫెక్టు కనిపించలేదు.
పైగా ఆయన వేరే ఛానెల్ లో చేసిన ఇదే తరహా కార్యక్రమం ఫెయిల్ కావడంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు మరింత ఆదరణ పెరిగింది.
రోజాను ఈ కార్యక్రమాల నుంచి తప్పించేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండటం వల్ల కార్యక్రమం నుంచి తప్పించాలని ఈటీవీ యాజమాన్యంపై వత్తిడులు వచ్చాయి.
అయితే మల్లెమాల సంస్థ యాజమాన్యం ఆమెను తప్పించలేదు.
ఆ విషయం తెలిసిన రోజా ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోయినా మల్లెమాల సంస్థ అడిగిందే తడవుగా అంగీకరించి వచ్చారు.
దాంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు మళ్లీ అదే ఆదరణ లభిస్తున్నది.