నగరంలోని మానేరు లా కాలేజీలో న్యాయ సేవాధికార సంస్థ, ఖమ్మం, మానేరు లా కాలేజ్ సంయుక్తంగా ‘ భారత రాజ్యాంగం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి సర్వోత్తృష్ట చట్టంమని, భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందని అన్నారు.
ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించిందని, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో రాజ్యాంగం ద్వారా తెలుస్తుందన్నారు. రాజ్యాంగంలో పీఠిక గుండె వంటిదని, రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధుల గురించి ప్రతి ఒక్క పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అందరికీ అందేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి సమయాన్ని వృధా చేయకుండా అనునిత్యం నేర్చుకుంటూనే ఉండాలన్నారు.
సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మన నుండే మార్పు మొదలవాలన్నారు. సమాజాన్ని బ్రూణ హత్యలు,వరకట్నం లాంటి సాంఘీక దురాచారాలు పట్టి పీడిస్తున్నాయని వీటిని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవ దయాగుణం కలిగి ఉండి సమాజానికి ఉపయోగపడాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ఎంతగానో కృషి చేయాలన్నారు. కష్టపడడంతోనే ఫలితం సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు న్యాయవిద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన యజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవ కార్యదర్శి మహమ్మద్ జావిద్ పాషా, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దిరిశాల కృష్ణారావు, కళాశాల చైర్మన్ యూనస్ సుల్తాన్, న్యాయవాదులు స్వామి రమేష్, పాపారావు, ఇమ్మడి లక్ష్మీనారాయణ, సింగం జనార్ధన్, మోహన్ రావు, రత్నాంబ, జయప్రకాష్ పెద్ద సంఖ్యలో న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.