ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను తెలుగుదేశం సానుభూతిపరుడు కాదని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తేల్చి చెప్పింది. కోడి కత్తి కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అఫిడవిట్ దాఖలు చేసింది. తన ఫిర్యాదులో జగన్ చెప్పినవన్నీ అసత్యాలేనని కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఎయిర్ పోర్టు రెస్టారెంట్ ఓనర్ పేరు హర్షవర్ధన్ ప్రసాద్ కాగా హర్షవర్ధన్ చౌదరి అని పిటిషన్ లో జగన్ రాశారని, అది తప్పు అని తేలిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఎయిర్ పోర్టు లో సీసీ కెమెరాలు పనిచేయలేదని అప్పటిలో జగన్ చెప్పినది కూడా అసత్యమని NIA చెప్పింది. అక్కడ అన్ని సీసీ కెమెరాలు పని చేశాయని, తాము ఫుటేజీని చూశామని కూడా చెప్పారు.
కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంక దర్యాప్తు అవసరం లేదని కూడా ఎన్ఐఏ తెలిపింది. శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను తెలుగు దేశం సానుభూతి పరుడు కాదు అంటే వై సి పి సానుభూతి పరుడా ?అసలు కుట్రదారుడు ఎవరో చెప్మా !పాపం శ్రీను ఎప్పటికీ బయటకొస్తారో అంటూ అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు ఘటనతో సంబంధం లేదని కూడా పేర్కొన్నది. జగన్ వేసిన పిటిషన్ను కొట్టి వేయాలని ఎన్ఐఏ కోరింది. కోడికత్తి కేసులో కౌంటర్ ను ఎన్ఐఏ దాఖలు చేసింది. వాదనలకు సమయం కావాలని జగన్ న్యాయవాదులు కోరారు. దాంతో కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది