నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో పునర్నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఆయా పాఠశాలల లోని మహిళా ఉపాధ్యాయినులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్ధ, శ్రీకాకుళం జిల్లా డి. ఇ. ఓ కుసుమ చంద్రకళను కోరారు.
ఈ మేరకు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిణిని కలసి వినతి పత్రం సమర్పించారు. నిర్మాణ పనుల్లో భాగంగా టాయిలెట్లు సైతం కొట్టేయడం వల్ల మహిళా ఉపాధ్యాయినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.
కాలకృత్యాలు తీర్చుకోడానికి సుదూర బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి రావడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. పాఠశాలలో ఒక్కరే మహిళ ఉన్న చోట పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ దృష్ట్యా రవాణా సదుపాయాలు తగ్గిపోయిన నేపధ్యంలో అనేక వ్యయ ప్రయాసలకోర్చి విధులకు హాజరవుతుండడం బాధాకరమని అన్నారు.
మహిళల వ్యక్తిగత, ఆరోగ్య ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లలో కొందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్భందిస్తున్నారని దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందిస్తూ తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేస్తామని డి. ఇ. ఓ అన్నారు.