ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రా రెడ్డి (81) మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. సీనియర్ నాయకుడు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కొల్పోయింది. జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి క్యాబినెట్ లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. తలమడుగు మండలంలోని స్వగ్రామం కోదడ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.