ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశోధించిన సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో పలు కీలక అంశాలు వెల్లడించారు. వివేకా హత్యకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి వై ఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని చార్జిషీట్ లో విస్పష్టంగా పేర్కొన్నారు. దీనితో బాటు వివేకా హత్య కేసు ఛార్జిషీట్లో పలు అంశాలు సీబీఐ ప్రస్తావించింది.
ఇవన్నీ సంచలనం కలిగించే అంశాలే కావడం గమనార్హం. కుట్ర చేసిన వారు ఆ తర్వాత, హత్య చేయించి దానికి సంబంధించిన సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించారని ఛార్జిషీట్లో సీబీఐ వివరించింది. ఫొటోలు, గూగుల్ టేకౌట్, ఫోన్ లోకేషన్ డేటా కోర్టుకు సీబీఐ సమర్పించింది. వైఎస్ వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలున్నా తగిన ఆధారాలు లభించలేదని చార్జిషీట్ లో పేర్కొన్నారు. సాక్ష్యాల చెరిపివేతలో మనోహర్ రెడ్డి ఉన్నా ప్రమేయంపై నిర్ధారణ కాలేదని సీబీఐ తెలిపింది.
వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నామని సీబీఐ తెలిపింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులను కోరాం. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉంది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి రావాలని పేర్కొన్నది. జూన్ 30న సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్ను ఇటీవల కోర్టు విచారణకు స్వీకరించింది.