రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అమరావతి రైతులు నిరసనలు ఉద్ధృతం చేశారు. పోలీసు ఆంక్షలు, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా సచివాలయం రెండో గేటు సమీపానికి రైతులు దూసుకొచ్చారు. మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా అక్కడికి తరలివచ్చారు. దారి వెంబడి ఉన్న ముళ్ల చెట్లను దాటుకొని భారీగా తరలివచ్చారు.
వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను చేతబట్టిన రైతులు, మహిళలు పోలీసుల చర్యను నిరసిస్తూ పంట కాల్వలో దిగి నిరసన చేపట్టారు. ప్రాణ సమానమైన భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.