రాష్ట్రంలోని రైతులందరూ ఆర్థికంగా బలోపేతం కావడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ నెంబర్ 28 భూసేకరణ పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంతోపాటు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు.
రైతులకు చెందిన 25 వేల రూపాయల లోపు రుణాలు మాఫీకి రూ 1200 కోట్లు డిపాజిట్ చేసింది అన్నారు దీంతో 75 శాతం మంది రైతులు లబ్ధి పొందుతారని, లక్షలోపు రుణాలు ఉన్నవారికి నాలుగు కిస్తూ లలో చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే రైతు బంధు పథకం కింద ఏడు వేల కోట్లు మంజూరు చేశామన్నారు.
గతంలో విత్తనాలు ఎరువుల కోసం క్యూలో నిలబడే వారని, లాఠీచార్జీలు జరిగేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. జిల్లాలో 80 వేల ఎకరాలు మొక్కజొన్న పంటలు వేశారని, ముధోల్ నియోజకవర్గం లో 25 నుంచి30 మెట్రిక్ టన్నుల మొక్కలు పండించారని తెలిపారు.
27వ 28 వ ప్యాకేజ్ పనులు పూర్తయితే లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు.27వ ప్యాకేజ్ పనులు ఏడు వందల కోట్ల వ్యయంతో, 28వ ప్యాకేజ్ పనులు 500 కోట్ల వ్యయంతో చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం కింద1.60 లక్షల మందికి పనులు కల్పిస్తున్నామన్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి భూసేకరణ పరిహారం కింద తాండూర్ మండలం చెందిన 113 మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల 12 లక్షల 40వేల 250 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, ఆర్ డి ఓ రాజు, డి సి సి బి వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, జెడ్పీటీసీ వొస రాజేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, బాశెట్టి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.