గత నాలుగు రోజులిగా కురుస్తున్న వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వాన వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వ్యవసాయ అధికారులు సర్వే పారదర్శకంగా చేయాలని రైతులు కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళే అధికారులకు చెప్పాలన్నారు.
పంట నష్టంపై అధికారులు చెప్పేదానికి జరిగిన నష్టానికి చాలా తేడా ఉందన్నారు. కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో 11,476 ఏకరాలు7708 మంది రైతులు నష్ట పోయారని అధికారులు చెప్తున్నారని కానీ ఇంతకు మించి రైతులు నష్టపోయారని తెలిపారు.పంట నష్టపోయిన కౌలు రైతుల పరిస్తితి ఏంటనేది తెలియజేయాలన్నారు. గత నెలలో పంట నష్ట పోయిన వారికి ఎకరాకు10 వెలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇంకా వర్ష సూచన ఉన్నందువల్ల కల్లాల్లో ఉన్న వడ్లు ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం లోగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో స్పష్టత ఇవ్వకపోతే మంగళవారం నుండి రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.