రైతుల వ్యవసాయ భూములలోకి వెళ్లడానికి ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని దారి ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జరిపే పెన్సింగ్ పనులను రైతులు అడ్డుకోవడంతో సందర్శించడానికి వచ్చిన యప్. డి.ఓ.రాజేందర్ కుమార్, డి.యప్. ఓ. రాంబాబులను వారు రైతులతో కలిసి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పనుల వల్ల భూములను, చెట్లు కోల్పోయిన అటవీశాఖకు నేరడ గ్రామంలో సర్వే నెంబరు 172లో గల 89 ఎకరాల భూమిని కేటాయించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిపే పెన్సింగ్ పనుల వల్ల రైతులు తమ వ్యవసాయ భూములలోకి వెళ్లడానికి ఎలాంటి దారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈ విషయాన్నిస్థానిక తహశీల్దార్, జిల్లా కలెక్టర్ ల దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి ఆదేశాలు రాకపోగా అటవీశాఖ అధికారులు భూమి చుట్టూ పెన్సింగ్ పనులు మొదలు పెట్టారు. ఎలాంటి అవకాశాలు లేని రైతులు ఆందోళనలు చేస్తూనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ యం యల్ సి చెరుపల్లి సీతారాములులను కలిసి వినతిపత్రం అందజేశారు.
వారి సూచన మేరకు స్పందించిన అటవీశాఖ అధికారులు రాజేందర్ కుమార్, రాంబాబు, శేఖర్ రెడ్డి లు వచ్చి, రైతుల సమస్యలు తెలుసుకొని వ్యవసాయ భూములలోకి వెళ్లడానికి దారి ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులకుా, దారి సౌకర్యం ఇప్పించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చొరవ చూపిన చెరుపల్లి సీతారాములు సహకారం అందజేసిన సిపిఎం నాయకులకు, నేరడ ఎంపీటీసీ భర్త మర్ల రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మెంబరు సన్యాసి రావులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.