తినడానికో బతుకు దెరువుకో తాము నమ్ముకున్న చేపల వేట అప్పుడప్పుడు మత్స్యకారుల తలరాతలు మారుస్తాయి. వారు వేసిన వలకు అప్పుడప్పుడు ఎంతో అరుదైన చేపలు పడుతుంటాయి. ఆ చేపలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను బట్టి వాటికి లక్షల్లో ధర పలుకుతుంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు కూడా ఇలాంటి చేప కారణంగా రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు.
జివానీలో నివసించే సదరు మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతడి వలలో ఎంతో అరుదైన సోవా లేక కిరి అని స్థానికం గా పిలిచే క్రోకర్ ఫిష్ పడింది. ఈ చేప 48 కిలోల బరువు తూగింది. దీన్ని వేలం వేయగా కళ్లు చెదిరే రీతిలో రూ.8.64 లక్షల ధర కు కొనుక్కున్నారు.
ఇంతకీ ఈ చేప విశేషమేమిటంటే ఈ చేపలోని ఓ భాగాన్ని ఫార్మా రంగంలో శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల తయారీకి దీన్ని వినియోగిస్తారు. అందుకే ఈ క్రోకర్ ఫిష్ కు అంత డిమాండ్! ఆసియాలోని కొన్ని ప్రాంతాలు,ముఖ్యం గా యూరప్ లో దీనికి అత్యధిక ధర పలుకుతుంది. ఇటీవలే జివానిలో ఇలాంటిదే ఓ చేప లభ్యం కాగా, అది రూ.7.80 లక్షలు పలికినట్టు వెల్లడైంది.
పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ కు మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు ఎక్కువగా లభ్యమవుతాయి.ఎలాగైతేనేమి తమ రాతను మార్చిన చెప్పాను అమ్మిన ఆ జాలరులు ఆనందంలో తేలియాడారు.