తండ్రి పెద్దకర్మకు ఏర్పాట్లు జరుగుతుండగానే కొడుకు మరణించడం ఎంత విషాదం? కడప జిల్లా పెనగలూరు మండలం తిరుణంపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. పళ్లాల పెంచలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 6వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతి వార్త విన్న కుమారుడు ప్రసాద్(21) కువైట్ నుంచి అంత్యక్రియలు చేసేందుకు వచ్చాడు.
ఆ తర్వాత పది రోజులు ఉండి పెద్ద కర్మకు ఏర్పాట్లు చేస్తున్నాడు. తన మేనమామలు పోలయ్య, గుర్రయ్యలతో కలిసి సరుకుల కోసం పెనగలూరుకు వెళ్లాడు. ఇదే మార్గంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన టాటా ఏస్ వాహనం పెనగలూరు వైపు నుంచి బెస్తపల్లి వైపు వెళుతోంది. కంబాలకుంట మలుపు వద్ద రెండు వాహనాలు ఢీ కొన్నాయి.
ద్విచక్రవాహనం ట్యాంక్ పూర్తిగా పగిలిపోయింది. ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా పోలయ్య, గురవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్ కు పంపారు. తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రసాద్ మృతి చెందాడు.