ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లక్ష్మీ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు పొలంలో దిగి రవీందర్ అనే ఒక యువకుడు ట్రాక్టర్ తో పొలం దున్నేందుకు ఉపక్రమించాడు. అయితే ఆ యువకుడి తండ్రి నేనావత్ వసన్ (48) అప్పుడే అక్కడకు వచ్చాడు. తన కుమారుడికి ట్రాక్టర్ నడపడం సరిగా రాదని భావించిన వసన్ కొడుకును ట్రాక్టర్ పై నుంచి దించాడు.
ఆ తర్వాత వసన్ ట్రాక్టర్ తీసుకొని ఓరం చెక్కడం మొదలు పెట్టిన క్రమంలో, ట్రాక్టర్ టైర్ పట్టు కోల్పోయి పక్క పొలంలో బోల్తాపడింది. ట్రాక్టర్ బాయినెట్ లో వసన్ తల ఇరుక్కుపోయింది. దాంతో నేనావత్ వసన్ (48) అక్కడిక్కడే మృతి చెందాడు. తనను దింపి ఉండకపోయి ఉంటే తన తండ్రి ప్రాణాలతో ఉండేవాడిని, తనకు జాగ్రత్తలు చెప్పి తన తండ్రి మరణించడం తో మృతుని కుమారుడి రోదనలు పలువురికి కంట తడి పెట్టించాయి. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని చేరుకొని పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.