రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుండె పోటుతో కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని స్వగృహంలో మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మానేరు తీరాన అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మంత్రి గంగుల చిన్న కుమారుడు. తండ్రి మృతితో మంత్రి గంగుల ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు, విచారం వ్యక్తం చేశారు. తండ్రి ని కోల్పోయిన బాధలో వున్న గంగులను సిఎం కెసిఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.