తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పంటల విస్తీర్ణం మేరకు, రైతులు ఇబ్బంది పడకుండా సరిపడా ఎరువులను సరఫరా చేయాలని, రాష్ట్ర వ్యవసాయ అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ఆదివారం సోమాజిగూడ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో వ్యవసాయ శాఖ అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు యూరియా అందుబాటు,పంటల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులు ఇబ్బంది పడకుండా, యూరియా పంపిణీ సక్రమంగా జరగాలని, అందుకోసం అవసరమైతే తాను స్వయంగా కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ మంత్రి సదానంద గౌడతో మాట్లాడతానని కిషన్ రెడ్డి అధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో సాగువిస్తీర్ణం పెరిగిందని, పెరిగిన విస్తీర్ణం మేరకు ఎరువుల వాడకం గణనీయంగా ఉంటుందని అందుకు తగ్గట్టు ఎరువుల సరఫరా జరగాలని మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
తెలంగాణ రాష్ర్టానికి కోరిన విధంగా ఈ ఏడాది 10.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని, గతేడాది ఈ సమయానికి 3.50 లక్షల టన్నుల యూరియాను విక్రయిస్తే.. ఈసారి ఇప్పటికే రైతులు ఏడు లక్షల టన్నులను కొనుగోలు చేశారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
సాకుకు అనుగుణంగా ఎరువుల సరఫరా జరిగేలా ఇప్పటికే చూస్తున్నారని, ఇంకా తెలంగాణ కు అదనంగా ఎరువులు అవసరమయ్యేలా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ విషయంలో అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందిస్తామని కిషన్ రెడ్డి సాను కూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులతో పాటు కేంద్ర హోమ్ శాఖ అదనపు కార్యదర్శి శశికిరణా చారి పాల్గొన్నారు.