అమరావతి రాజధాని కేసుల్లో ఏ.పి హై కోర్ట్ తీర్పు పై అమరావతి పరిరక్షణ సమితి జెఏసి ఉండవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధాని కేసులలో ఎ.పి.హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా జె ఏ సి నేత జంగాల వెంకటేష్ మాట్లాడుతూ 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందని అన్నారు.
భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అభివృద్ధి పరిచి అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసారు. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నేతలు గాదే శ్రీనివాసరావు, సునక బుజ్జి, కోనపరెడ్డి రమేష్, సిగిరిశెట్టి లీలా కృష్ణ, తాండ్ర కిషోర్, ఉమామహేశ్వర్ రెడ్డి, శివుడు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.