పొడుచుకొచ్చిన పొద్దు
కాలాన్ని కొలుస్తూ కొలుస్తూ
పడమటిఇంటిలో సేదతీరినట్లుగా …!
తెలుగు వారి హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిపోయిన
అపర చాణుక్యులు వీరు …!
హంగూ ఆర్భాటాల
అహంకారపు రెక్కలు తొడగని
రాజనీతిజ్ఞులు వీరు …!
తెలుగు ఆహార్యాల సొగసుతో
మృదుమధురంగా మాట్లాడే
బహుభాషా కోవిదులు వీరు …!
కుల మతాల ప్రస్తావన
లేని రాని తీసుకురాని దీనజనోద్ధరణ
చేపట్టిన మానవతామూర్తి వీరు …!
వేయిపడగలను అనువదించి
తెలుగు తల్లికి అక్షరాభిషేకం చేసిన సాహిత్యమూర్తి వీరు …!
నిశ్శబ్దాన్ని కప్పుకొని
దేశానికి మేలు చేసిన
పాలనాదక్షులు వీరు …!
ప్రశంసను విమర్శను
ఒకే రీతిగా స్వీకరించగల
స్థితప్రజ్ఞుడు వీరు …!
ప్రతి తెలుగు వాడి
గుండె గుడిలో కట్టిన
మీ విగ్రహం సాక్షిగా …
తెలుగు వారి హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిపోయిన
అపర చాణుక్యుడు పీవీ …!
అందుకోండి…
ఉదయ జానకి లక్ష్మి అర్పించు
కవితాక్షర నివాళి !కవితాక్షర నివాళి !!
డా.చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి, B.Ed, M.A(Telugu), M.A(S.W), Ph.D ఒంగోలు