కరోనా లాక్ డౌన్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్ధిక వ్యవస్థలో భాగంగా చితికిపోయిన వ్యాపారులకు, వాణిజ్య సముదాయాల వారికి ఆస్తిపన్ను మినహాయింపు కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి. నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. అదే విధంగా లాక్ డౌన్ సమయంలో కరెంటు బిల్లుల పెరుగుదలను నిలిపివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వాణిజ్య సముదాయాలకు,నివాస గృహాలకు, చేతి వృత్తి షాపులకు, హోటల్స్ కు లాక్ డౌన్ సమయంలో ఎక్కడా వ్యాపారాలు జరగలేదని, అందువల్ల పని చేసేవారికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాణిజ్య సముదాయాలు
సాధారణ మెయింటెనెన్సుకు కూడా ఆదాయం లేకపోవడం వల్ల ఇప్పుడు ఆస్తి పన్ను కట్టే పరిస్థితి యజమానులకు లేదని ఆయన అన్నారు. అందువల్ల వాటికి అర్ధ సంవత్సరం ఆస్తిపన్ను మినహాయింపు ప్రకటించాలని కోరారు. అలాగే లాక్ డౌన్ 2 నెలల సమయానికి ఏప్రిల్ నెలలో ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తిరుపతి నగరంలోని షాపులకు, వాణిజ్య సముదాయాలకు లాక్ డౌన్ కాలంలో తీరని నష్టం జరిగిందని ఆయన అన్నారు.
తిరుమల తిరుపతిలో వ్యాపారుల పరిస్థితి మరీ ఘోరం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయడంతో తిరుమల తో పాటు తిరుపతిలో భక్తుల పై ఆధారపడి వ్యాపారాలు కొనసాగిస్తున్న అన్ని వర్గాల వ్యాపారస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల కరెంటు మీటర్ రీడింగ్ తీయకపోవడం, మార్చి ఏప్రిల్ రెండు నెలల మీటర్ రీడింగ్ ఒక్కసారిగా తీయడంతో వాడకం యూనిట్లు రెండు నెలలకు కలిపి విపరీతంగా పెరగడం సహజం దాని కారణంగా ఏ కేటగిరీలో 0-50 యూనిట్ల వరకు ఒక యూనిట్ ధర1.45 పైసలు ఉండగా రెండు నెలల తర్వాత మీటర్ రీడింగ్ తీయడంతో ఒక్కసారిగా యూనిట్ ధర అమాంతం పెరుగుతూ 6.90 నుంచి 8.50 వరకు అలాగే 500 యూనిట్లు మించిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు క్యాటగిరి బి కేటగిరి సి ధర 9.95 మోపడం అన్యాయమని ఆయన అన్నారు.