ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అశిలేశ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు చెప్పారు. ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్న అఖిలేశ్ యాదవ్.. ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందని, ఇవాల్టితో ఇంకా 399 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. రైతులను ఆదుకుంటామని మోదీ మాటతప్పారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేశారని అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి ప్రతిపక్షాలను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కేసుల పేరుతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులపాలు చేస్తున్నదని అన్నారు.