మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కూకీ తెగకు చెందిన గిరిజనులపై మారణ హోమం సాగుతుంది. ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడి, హత్య చేయటం సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నదని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు.
సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్ మణిపూర్ మారణకాండను ఆపాలని, శాంతిని నెలకొల్పాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించడం జరిగింది, జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ జరిగింది, ఈ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.
ఈ సభలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర, జిల్లా నేతలు మాట్లాడుతూ, మణిపూర్ లో కొండ కోనల్లో శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్న ప్రజల మధ్య మతోన్మాద ప్రభుత్వం తన లబ్ధి కోసం 54% పైన ఉన్న మైతి కులస్తులకు, కూకి నాగా గిరిజన తెగల మధ్య తన రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టింది.
గిరిజన చట్టాలను అతిక్రమించి మైతిలను గిరిజనులుగా మార్చడానికి ఒడిగట్టింది. ఆదివాసీలను అడవుల నుండి బయటకు పంపించి రిజర్వేషన్లు పొంది, విలువైన ఖనిజ సంపదను పొందాలనే కుట్రలు పన్నింది. ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ కూకి నాగా ఆదివాసి తెగల ప్రజలు నిరసన తెలియజేయగా, వారిపై గత మూడు నెలల నుండి బిజెపి అండతో మైతి కులస్తులు తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నారు.
గృహ దహనాలు, చర్చిలతోపాటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. హత్యాకాండ కొనసాగిస్తున్నారు. హింసాత్మకమైన ఘటనలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలని, అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని వారన్నారు.