మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఓవ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతను ఢిల్లీలో జరిగిన తబ్లిక్ జమాత్ కార్యక్రమానికి హాజరై గత 15 రోజుల క్రితం మెదక్ పట్టణానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని జమాత్ కార్యక్రమానికి హాజరైన వారికి పరీక్షలు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు వ్యక్తితో పాటు మరికొందరిని ఇదివరకే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో పరీక్షల అనంతరం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టం అయ్యింది.
దీంతో మొదటిసారిగా మెదక్ లో కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. అతను ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు. ఎవరెవరిని కలిశాడు. అన్నదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
వారందరిని ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉంచిన అధికారులు కుటుంబ సభ్యులందరికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో మెదక్ పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లలో నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు వహిస్తున్న ప్రజలు పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఇప్పుడు బయట అడుగుపెట్టేందుకు కూడా జంకుతున్నారు.