కడప జిల్లా రాజంపేట పట్టణంలో ని బైపాస్ లో గల మేడా నిలయంలో శుక్రవారం వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమరనాధ రెడ్డి, పట్టణ వైసీపీ నేత పోలా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మహమ్మారి కరోనా కారణంగా అతలాకుతలం అవుతున్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా నిలవడం కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.
ఈరోజు 1400 కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూపుల అక్క చెల్లెమ్మకు అందచేస్తున్నామని అన్నారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 91 లక్షల మందికి అంటే మొత్తం 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు చేయూత లభించిందని అన్నారు.
ఈ మొత్తాన్ని ఆయా సంఘాల అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. రాజంపేట నియోజకవర్గంలోని 3863 డ్వాక్రా గ్రూపులకు గానూ40618 మంది డ్వాక్రా మహిళల ఖాతాలలో దాదాపు 9.06 కోట్ల రూపాయల మొత్తాన్ని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా జమ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు,డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.