గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో మొదటి బహుమతి లభించింది. ఎగ్జిబిషన్ – 2023 ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు ఈ బహుమతిని అందుకున్నారు.
ప్రభుత్వ శాఖలు, పథకాల అమలు ప్రదర్శన, మంచి అలంకరణ విభాగంలో తెలంగాణ అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ఈ బహుమతి దక్కింది. ప్రతీయేటా జరిగే ఎగ్జిబిషన్ లో తెలంగాణ అటవీశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన, మినీ జూతో కూడిన స్టాల్ ను ఏర్పాటు చేస్తుంది.
ఈసారి అడవి, వన్యప్రాణుల థీమ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన సందర్శకులు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈయేడు కూడా సమర్థవంతగా స్టాల్ ను నిర్వహించి బహుమతి గెలుచుకున్న అధికారులు, సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ అభినందించారు.