కరోనా వైరస్ నియంత్రణ లాక్ డౌన్ వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు ఉపాధికి దూరమై బ్రతుకు భారమై పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్, సిపిఐ జల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
కడప నగరం లోని 4 వ డివిజన్ పరిధి లోని ఎస్టీ కాలనీ లో పేద ప్రజలకు బుధవారం నాడు వారు బియ్యం పంపిణీ చేశారు. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ టెలివిజన్ ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కేవలం సప్త సూత్రాలు చెప్పారు కానీ ఉపశమనం కలిగించలేదని వారు అన్నారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలు వివరించడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. కరోనా మహమ్మారి పేరుతో సమాజంలో సామాజిక మతపరమైన చీలికలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ, నగర కార్యవర్గ సభ్యులు బ్రహ్మo, లింగన్న, జయరామయ్య, ఆచారమ్మ, మల్లికార్జున, సుబ్బరాయుడు, గుర్రన్న, నాగముని, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.