సమీకృత చేపల అభివృద్ధి పథకం క్రింద జిల్లాలో చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేపల విడుదల పారదర్శకంగా పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పథక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1129 చెరువులు, 4 రిజర్వాయర్లలో 362.17 లక్షల చేప పిల్లల విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 475 చెరువుల్లో 12551526 చేప పిల్లల విడుదల జరుగునట్లు ఆయన అన్నారు. ప్రతిరోజూ ఏ ఏ చెరువుల్లో ఎన్ని చేప పిల్లల విడుదల చేసేది ఒక రోజు ముందుగా నివేదిక ఇవ్వాలన్నారు. మండల అభివృద్ధి అధికారుల సమక్షంలో సొసైటీ బాధ్యులచే చేప పిల్లల సైజు, పరిమాణం ఆర్డర్ ప్రకారం ఉన్నది లేనిది తనిఖీ చేయాలని, తనిఖీ ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు విడుదల చేసిన చేప పిల్లలు ఆయా చెరువుల్లో ఆర్డర్ మేరకు సైజు, సంఖ్య సరిగా ఉన్నవి లేనివి నివేదిక ఇవ్వాలన్నారు. చేప పిల్లల స్టాకింగ్ సమయంలో పంచాయితీ కార్యదర్శులు ఉండాలని, స్టాకింగ్ పై నివేదిక సమర్పించాలని ఆయన తెలిపారు.
సొసైటీల్లో ఎంత మంది సభ్యులు ఉన్నది, అందులో ఎంతమంది చేపలు పెట్టేవారు ఉన్నది నివేదిక ఇవ్వాలన్నారు. సొసైటీల జనరల్ బాడీ మీటింగులకు ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడివోలు హాజరుకావాలన్నారు. చేపలు పట్టడం సొసైటీ సభ్యులు మాత్రమే చేయాలని, మధ్య దళారులకు అప్పగించిన వారిపై తగుచర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ చేపల పట్టకం జరిగింది, ఎక్కడ జరగలేదు నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి సొసైటీ డిపాజిట్లకు సొసైటీ ఖాతా ఉండాలని, ప్రతి లావాదేవీ ఖాతాల ద్వారానే చేపట్టాలని ఆయన అన్నారు. ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేపల స్టాకింగ్ సమయంలో చేపల సైజ్, సంఖ్య, విడుదల చేస్తున్న వీడియోలను పరిశీలించి, సూచనలు చేశారు.