జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక కల్నల్, ఒక మేజర్, ఇద్దరు జవాన్లతో బాటు జమ్మూ కాశ్మీర్ పోలీసు ఒకరు మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం మన సైనికాధికారులు అమరవీరులయ్యారు. ఇద్దరు పెద్ద క్యాడర్ అధికారులతో బాటు మరో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు అధికారి మరణించడం భారత్ కు ఇటీవలి కాలంలో జరిగిన భారీ నష్టంగా చెప్పవచ్చు.
ఉత్తర కాశ్మీర్ లోని హండ్వారా ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పౌరులు ఉండే ప్రాంతంలోకి ఉగ్రవాదులు జొరబడ్డారని, పౌరులను కవచాలుగా చేసుకుని దాడులకు తెగబడతారని విశ్వసనీయ సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యం జాయింట్ ఆపరేషన్ ను శనివారం రాత్రి ప్రారంభించారు.
దొంగదెబ్బ తీసిన ఉగ్రమూకలు
కార్డన్ అండ్ సెర్చి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి అక్కడ ఉన్న పౌరులందరిని సురక్షితంగా పంపిన తర్వాత ఉగ్రవాదులకు భద్రాతాధికారులకు మధ్య హోరా హోరీ పోరు జరిగింది. ఈ పోరాటంలో ఇద్దరు ఉగ్రవాదులు తుదముట్టించారు. ఆపరేషన్ పూర్తి అవుతున్న సమయంలో అనూహ్యంగా వెనుకనుంచి దెబ్బతీయడంతో ఒక కల్నల్, ఒక మేజర్ తో బాటు ఇద్దరు జవాన్లు, ఒక పోలీసు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి త్యాగం వృధాగా పోదని ఆయన అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.