తమిళనాడు రాష్ట్రంలోని తిరప్పూర్ జిల్లా పల్లడంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. పల్లడంలోని బిజెపి నేత మోహన్ రాజ్ కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు నరికి చంపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
హత్యకు గల కారణాల మీద ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే, ఇంటి ముందు మద్యం తాగొద్దని చెప్పినందుకే బిజెపి నేత మోహన్ రాజ్ కుటుంబాన్ని దారుణంగా హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఆయన హత్యకు మద్యం గొడవే కారణమా? రాజకీయంగా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిజెపి నేత మోహన్ రాజ్ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆయన హత్య వెనుక అధికార డిఎంకే పార్టీ వర్గీయులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ రాజ్ కుటుంబంలో హత్యకు గురైన నలుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఆ సమయంలో మోహన్ రాజ్ ఇంటి ముందు కొంతమంది దుండగులు.. మద్యం సేవిస్తూ గొడవ చేస్తుండడంతో.. వారిని వారించారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు ఇంట్లోకి దూరి నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది.