స్నేహం అనిర్వచనీయమైన అనుభూతిని పంచే మహోన్నతమైన బంధం. ఉత్తమ స్నేహబంధం ఎన్నో జన్మల పుణ్యఫలం. నేటి తరానికి ఇవేవీ తెలియకపోవచ్చు. వాట్సప్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ అనుకుంటున్న నేటి తరానికి స్నేహం లో ఉన్న పవిత్రత తెలియదు. స్నేహం దైవ సన్నిధిలో.. దైవసాక్షిగా.. ఎంతో పవిత్రంగా ఏర్పడే మహోన్నతమైన ఘట్టమని అసలు తెలియదు… ఇటువంటి ఘట్టాలు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.. ఆప్యాయత, అనురాగం కలగలిపిన మైత్రి బంధం … దైవ సన్నిధిలో ఎలా కలుస్తుందో తెలిపే ఘట్టం ఇచ్చాపురం పట్టణంలోని చిన్న జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఆవిష్కృతమైంది.
స్థానిక చిన్న జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ స్వామి వారి సన్నిధిలో నేస్తం వేడుక ఘనంగా జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ నేస్తాలుగా మారారు. జగన్నాధుని సన్నిధిలో నేస్తాలుగా మారాలని నిర్ణయించుకున్న ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని అమీన్ సహపేట గ్రామానికి చెందిన కాతిల భారతి, బొండాడ మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. పువ్వులు పండ్లు నీరు భూమి ఆకాశాల నడుమ చేతిలో చేయి వేసి నేస్తాలుగా మారారు.
ఇకపై ఆ రెండు కుటుంబాలలో ఏ కార్యక్రమం జరిగిన నేస్తం కుటుంబానికి తొలి పిలుపు అని ప్రమాణం చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కొత్త బట్టలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు కుటుంబాల బంధాలు కలకాలం నిలిచేలా పువ్వులు, పండ్లు, తీపి పేలాలు ఇది కుటుంబాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం జగన్నాథ స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఎంతో ఆహ్లాదంగా జరిగిన నేస్తం వేడుకను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ నిర్వహించారు. ఇద్దరు నేస్తాలను ఆశీర్వదించారు.