ఎడతెరిపి లేని వాన కారణంగా ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం అయిందని, తక్షణమే జిల్లా అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు.
గోదావరిలో క్రమేణా పెరుగుతున్న నీటి ప్రవాహంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సీతక్క కోరారు. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా ఉండాలి. ములుగు నియోజక వర్గం లో వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.
కాజువేలు, వంతెనల మీదుగా వరద నీరు పోతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి గోదావరిలోకి వరద నీరు చేరి గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహాక ప్రాంతాలు అయిన ఏటూరు నాగారం, మంగపేట, కాన్నాయి గూడెం,కొత్త గూడ మండలాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సీతక్క కోరారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని ఆమె కోరారు. ములుగు జిల్లాలో ఏటూరునాగారం, కమలాపురం మధ్యలో ఉన్న జీడివాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఎగువ నుండి వరద పోటెత్తుతుండటంతో గోదావరి నది ప్రవాహం క్రమేణా పెరుగుతుంది.
ఏకధాటి వానతో ములుగుతో పాటు మహబూబాబాద్ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సీతక్క కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో తమ యంత్రాంగాన్నీ అలర్ట్ కావాలని, ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లను వినియోగించుకోవాలని సీతక్క కోరారు.