నడిగడ్డ లో కల్తీ కల్లు వ్యాపారం ఎవరు చేశారు గద్వాల ప్రాంతంలో మద్యం మాఫియా ఎవరు నిర్వహించారో అందరికీ తెలుసునని గద్వాల నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మద్యం నిషేధం కోసం దీక్ష చేస్తున్న మాజీ మంత్రి డి కె అరుణ భర్త మద్యం వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలు చేశారని, ఆయన ఆగడాలను ప్రశ్నించి నిలదీసిన పాపానికి సాక్షాత్తు ఓ విలేకరిని రైలు పట్టాలపై వేసి చంపేందుకు యత్నించారని ఎమ్మెల్యే అన్నారు.
మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమలు చేయాలని అనడం సబబు కానీ దానికి మీరు ఉద్యమిస్తే మాత్రం దొంగ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు ఉంటుంది. మీరు కానీ మీ అనుచరగణ సన్యాసులు కానీ ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి డీకే అరుణకు మొన్న ఎన్నికల్లో బంగ్లా అరాచకాలను చూసి ఓర్వలేక ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు.
గద్వాలలో అరుణ ఓడిపోయిన కారణం ఆ కుటుంబం, వారి అనుచరగణం అరాచకాలేనని ఎమ్మెల్యే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బడుగు జీవుల సంసారాల్లో మద్యం చిచ్చుపెట్టి బతుకులను బజారుపాలు చేస్తే విసిగిపోయిన మహిళా మణులు సంకల్ప దీక్షతో అరుణను ఓడించి తగిన గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే అన్నారు.
ఉనికిని కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీని మెప్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం తగదని ఆయన అన్నారు. అరుణమ్మ తీరు చూస్తుంటే పతివ్రత పరమన్నం వండితే – తెల్లారే వరకూ సల్లగా కాలేదంట అలా ఉంది మీ మద్యం దీక్ష సైతం అని ఎద్దేవా చేశారు. ముందు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను మద్యం మాన్పించి ఉద్యమం చేపడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని ప్రకటించండి అనంతరం పార్టీ తరఫున మాట్లాడండి అని అన్నారు.