రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని, అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది అవాస్తవమని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ప్రభుత్వ చర్యలకు తాము భయపడమని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిజాలను వెలికి తీసేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడంలో వాస్తవం లేదని, కేవలం రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని చెప్పారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు గల్లా జయదేవ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.