ములుగు జిల్లా ఏటూర్ నాగారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ చెత్త అక్కడే వదిలి వేయడంతో గత వారం రోజులుగా దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో గ్రామ ప్రజలు, ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోపక్క మంగళవారం రోజున రంజాన్ పండుగ ఉండడంతో పండుగను దృష్టిలో ఉంచుకొని అయినా అధికారులు పాలకులు గ్రామంలో పేరుకుపోయిన చెత్తాచెదారం సైడు కాలువలో తీసినటువంటి మట్టిని శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వదిలివేయడం తో రామాలయం నుండి శివాలయం వరకు సైడు కాలువలో తీసిన మట్టి కుప్పలు కుప్పలుగా రోడ్డుకు పక్కన పోసి వదిలేయడంతో దుర్వాసనతో పాటు అధ్వానంగా మారింది. ఈ మార్గం గుండా కబరస్తాన్ ఉంది.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు కబరస్తాన్ లో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు వారి ఆచార సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. దానికి అడ్డంగా సైడ్ కాలవలు తీసిన మట్టి కుప్పలు కుప్పలు గా ఉండడం అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి సైడు కాలువలు తీసి వదిలివేసిన మట్టి పేరుకుపోయిన చెత్తాచెదారం శుభ్రం చేసి గ్రామంలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీకి రెండు ట్రాక్టర్లు రెండు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అర్థం చెట్లకు నీరు పట్టడం లేదు. సైడు కాలువలో తీసిన మట్టిని మూడు కిలోమీటర్ల అవతల డంపింగ్ యార్డ్ కు తరలించాల్సి ఉన్నప్పటికీ అడిగే వారు లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి