జిల్లాలో భారీ వర్షాలు, రాళ్ల వాన కారణంగా నష్టపోయిన పంట వివరాలు రైతుల వారీగా సేకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాయ భవన సముదాయ సమావేశ మందిరంలో పంట నష్ట వివరాలు సేకరణకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులతో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సమీక్షించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, రాళ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారని, మన జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 8313 ఎకరాలలో భారీ వర్షానికి, రాళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వారీగా పంట నష్టం అంచనాలను రూపొందించా లని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33% కంటే అధికంగా నష్టపోయిన పంట పొలాలను గుర్తించాలని, పంట నష్టం అంచనా వేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పూర్తి పారదర్శకతతో, సంపూర్ణ బాధ్యత వహించాలని, ప్రతి మండల, క్లస్టర్ స్థాయిలలో జిల్లా స్థాయి అధికారులు పంట నష్ట వివరాలు పర్యవేక్షించాలని, సంపూర్ణ వివరాలతో కూడిన నివేదికను హార్డ్, సాఫ్ట్ కాపీలు ఏరోజుకారోజు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం పట్టాదార్ రైతులతో పాటు కౌలు రైతులకు సైతం నష్టపరిహారం అందించాలని నిర్ణయించిందని, పంట నష్ట వివరాలు సేకరించే సమయంలో అక్కడ ఎవరైనా రైతులు కౌలు చేస్తున్నారో పరిశీలించాలని, పొలం కౌలులో ఉన్నట్లయితే కౌలు రైతుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతుల వివరాల సేకరణను స్వయంగా వ్యవసాయ విస్తరణ అధికారులే చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల , సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.