38.7 C
Hyderabad
May 7, 2024 17: 47 PM
Slider జాతీయం

మ్యూజియంల రీఇమేజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్న హైదరాబాద్

#kishanreddy

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరి 15-16 తేదీలలో హైదరాబాద్ లో  ‘భారతదేశంలో మ్యూజియంల రీఇమేజింగ్’   అనే అంశంపై మొదటిసారిగా రెండు రోజులపాటు గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తోంది. ఈ సమావేశం లో భారతదేశం తో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డమ్ వంటి అనేక దేశాల నుంచి మ్యూజియం రంగంలోని నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రజలందరికీ అవకాశం ఉంటుంది. ఇప్పటికి 2300 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశంలోని ప్రజలు, సంస్కృతి సాధించిన విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించబడుతోంది.

ప్రపంచస్థాయి సమావేశాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ “భారతదేశం మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు అనుగుణంగా అంకితభావంతో కృషి చేస్తున్నదని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. భారతదేశంలోని 1000 కి పైగా మ్యూజియంలు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో మరియు సంరక్షించడంలో మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.’’ 

‘‘గత 7 సంవత్సరాలుగా డిజిటల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ఆకర్షణీయమైన ప్రదర్శనలు, సమాచారంతో కొత్త మ్యూజియంలను నిర్మించడంపై నూతనంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఉన్న మ్యూజియంలను కొత్త తరానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది’’ అని మంత్రి తెలిపారు.

ఈ ప్రపంచస్థాయి సమావేశం, మ్యూజియం అభివృద్ధి మరియు నిర్వహణ రంగంలో ఉత్తమ పద్ధతులను, ప్రణాళికలను గురించి చర్చించడానికి వీలుగా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, అభ్యాసకులను ఒకే చోట చేరుస్తుంది. 25 మందికి పైగా మ్యూజియాలజిస్టులు, మ్యూజియం నిపుణులు, మ్యూజియంల పునరుద్ధరణకు సంబంధించిన ప్రాధాన్యతలు, అభ్యాసాలను పరిశీలిస్తారు. ఈ విధంగా పంచుకున్న విజ్ఞానం ద్వారా కొత్త మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన నమూనాను రూపొందించడం, పునరుద్ధరణకు సంబంధించిన విధానాలను అభివృద్ధి చేయడం, భారతదేశంలో ఇప్పటికే ఉన్న మ్యూజియంలను పునరుద్ధరించడం జరుగుతుంది.

ఈ ఆన్ లైన్ సమిట్ నాలుగు విస్తృతమైన అంశాలను కలిగి ఉంటుంది. నమూనా, నిర్మాణం; నిర్వహణ; సేకరణ, (ప్రదర్శన పరిరక్షణ పద్ధతులతో సహా అవగాహన కల్పించటం సహా) విద్య, సందర్శకులు ఈ సమావేశంలో పాల్గొనడం కోసం : https://www.reimaginingmuseumsinindia.com/  వెబ్ సైట్ ను సందర్శించగలరు.

Related posts

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Satyam NEWS

సినిమా స్టార్ట్:విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ షూటింగ్

Satyam NEWS

రెండో దశ పంచాయితీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment