రెండు దశాబ్దాల అన్వేషణ తరువాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ నక్సల్స్ ప్రభావిత సోన్ భద్ర జిల్లాలో సుమారుగా 3,350 టన్నులు బంగారం గని కనుగొన్నారు. ఇక్కడ ఉన్న బంగారం నిల్వలు ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్న బంగారం కన్నా దాదాపుగా ఐదు రెట్లు ఎక్కువ.
ప్రస్తుతం దేశంలో ఉన్న బంగారం నిల్వ సుమారుగా 626 టన్నులు. ఈ బంగారం గని నుంచి బంగారం వెలికి తీసేందుకు గనిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. సోన్ పహాడీ, హర్దీ ఫీల్డ్ రెండు చోట్ల బంగారం నిల్వలు ఉన్నాయని కనుగొన్నారు.
సోన్ పహాడీ లో 2,700 టన్నుల బంగారం హార్దీ ఫీల్డ్ లో 650 టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల బృందం నేడు సోన్ భద్ర జిల్లా కేంద్రాన్ని సందర్శించింది. ఈ బృందం సంబంధిత స్థలానికి జియో ట్యాగింగ్ చేసి గోల్డ్ మైన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తారు.
ఈ గనులు చిన్న కొండ ప్రాంతంలో ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనివల్ల సులభంగా ఈ బంగారపు గనులను తవ్వవచ్చునని నిర్ణారించారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత తవ్వకం పనులు మొదలు పెడతారు. ఇదే ప్రాంతంలో బంగారంతో బాటు అతి విలువైన యురేనియం కూడా ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు.
బుందేల్ ఖండ్ ప్రాంతం, విధ్య జిల్లాల్లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, సున్నపురాయి, గ్రానైట్, ఫాస్వేట్, క్వార్జ్, చైనా క్లే లాంటి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను వెలికి తీయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ఎంతో మంది నిపుణులకు, నైపుణ్యత లేని వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కారణాలతో వెనుకబడిన ఆ రెండు జిల్లాల్లో అభివృద్ధికి హద్దుల్లేకుండా పోతుంది.