తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో వారిని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి హరీశ్రావును సీఐటీయూ, అంగన్వాడీ సంఘాల నేతలు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి వారితో చెప్పారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల మందికి ప్రయోజనం కలగనుంది. మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.