కెటిఆర్ జిల్లాకు వస్తే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు బయట తిరగకూడదా? మనది ప్రజాస్వామ్యమా, లేక రాచరికమా? అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కెటిఆర్ జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా వీరభద్రం, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావులను వైరాలో తమ ఇండ్లలో ఉండగా అక్రమంగా అరెస్టుచేసి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు.
వైరా ఎం.ఎల్.ఎ. రాములు నాయక్ పర్మిషన్ తీసుకొని పామాయిల్ రైతుల సమస్యలపై మెమోరాండం యివ్వటానికి వెళ్ళిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సొసైటీ డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, రైతు సంఘం నాయకులు చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి పురుషోత్తంలను అంజనాపురం సభ వద్ద అరెస్టు చేశారని, రఘునాధపాలెం మండల కార్యదర్శి నవీన్ రెడ్డిని ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.బషీర్తో పాటు జిల్లావ్యాప్తంగా డివైఎఫ్ఐ నాయకులను, ఖమ్మంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు.
ప్రజలంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. ప్రజల్లో తమ పార్టీకి నిజంగా అభిమానం వుంటే అభివృద్ధి కార్యక్రమాలకు కూలియిచ్చి ఎందుకు పట్టుకొస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కెటిఆర్ చేసిన పర్యటన ఎన్నికల పర్యటన లాగానే వుంది. పైగా ఎప్పుడో ఏడాది క్రితం ప్రారంభమైన మున్సిపల్ కార్యాలయాన్ని, 6 నెలల క్రితమే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను, గోళ్ళపాడు ఛానల్, పార్కులను మళ్ళీ ప్రారంభించడం అనేది ఎన్నికల స్టంట్ మాత్రమే అని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల కనీస గౌరవం లేదని, తాము ప్రజా ప్రతినిధులమని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది మర్చిపోయి, అహంకారపూరితంగా, పెత్తందారులుగా, నియంతలుగా ప్రజలను అణచివేసే వైఖరిని కొనసాగిస్తే ప్రజాస్వామ్యమే ప్రాణంగా భావించే ఖమ్మం జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరిక చేశారు.