కరోనా లాక్ డౌన్ సందర్భంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో హైదరాబాద్ లో అన్ని రోడ్లకూ ముస్తాబు చేశారు. దాదాపు అన్ని రోడ్లు కూడా తారుతో నిగనిగలాడుతున్నాయి. పాడైపోయిన రోడ్ల ను బాగు చేస్తే ఫర్లేదు కానీ అదేమిటో బాగ్ అంబర్ పేట్ డివిజన్ లోని డీడీ కాలనీ లో అవసరం లేకున్నా కూడా బంగారం లాంటి రోడ్డును తవ్వి మళ్లీ రోడ్డు వేసేశారు. ఎందుకు?
ఎందుకేమిటి రోడ్లు వేస్తే కాంట్రాక్టర్ అక్కడి ప్రజా ప్రతినిధులకు లాభంలో షేర్ ఇస్తాడు కదా అందుకు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే లేకపోతే ఇక్కడ రోడ్డు కొత్తగా వేయాల్సిన అవసరమే లేదని స్థానికులు అంటున్నారు. కొత్త రోడ్లు వేసేటప్పుడు తవ్విన మట్టిని మాత్రం ఇక్కడే మర్చిపోయారు.
రోడ్డుకు అడ్డంగా కుప్పలు కుప్పలుగా మట్టి పోసి అలాగే ఉంచేశారు. ఇప్పుడు వర్షం కురిస్తే ఈ ప్రాంతం అంతా బురదగా మారడమే కాకుండా వేసిన కొత్త రోడ్డు కూడా పాడైపోతుంది. ఈ మట్టి తీయించే బాధ్యత కార్పొరేటర్ కు, అధికారులకు లేదా అని స్థానికులు అడుగుతున్నారు. ఏదైనా లాభం వచ్చే పని ఉంటే ముందు వరుసలో ఉంటారు లాభం లేని పని అయితే చూసీచూడనట్టు వ్యవహరిస్తారు అక్కడున్న కాలనీ వాసులు అంటున్నారు.
బాగ్ అంబర్పేట్ డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయని, వార్డు మెంబర్లు పేరుకే ఉన్నారు కానీ ఒకరోజు ఒక గల్లీ తిరిగి సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్న పాపాన పోలేదని తెలంగాణ ఉద్యమకారుడు జీవన్ గౌడ్ అన్నారు. వార్డ్ మెంబర్ లను ఏరి కోరి బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ నియమించారని, అయితే ఒక్కరికి కూడా ఏం చేయాలనే అంశంపై అవగాహన లేదని ఆయన అన్నారు.