ప్రభుత్వ వైద్యుల పట్ల ఐఏఎస్ అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ముందు వరుసలో ఉండి కష్టపడి పనిచేస్తున్నా తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేలా ఐఏఎస్ ఆఫీసర్లు ప్రవర్తిస్తున్నారని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జీడీఎ) ఆరోపించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలమ్ సాహ్నికి లేఖ రాశారు. వివిధ జిల్లాల్లో డాక్టర్లను ఐఏఎస్ అధికారులు ఎలా అవమానిస్తున్నారో వివరిస్తూ కన్వీనర్ డాక్టర్ జయధీర్ బాబు మూడు పేజీల లేఖలో వివరించారు. ఈ వేధింపులు ఆపకపోతే కరోనా విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, ఆర్ఎంపీలతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి కరోనా కేసులను చూడాల్సిందిగా ఆర్ఎంపీలను కోరారని అసోసియేషన్ పేర్కొంది. ఇది పూర్తిగా మెడికల్ ఎథిక్స్కు విరుద్ధమని, ఈ విషయాన్ని తాము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దృష్టికి తీసుకెళుతున్నామని తమ లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారని, సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్ఓ)ను హాల్ మూలలో నిలబెట్టారని ఆయన తెలిపారు. కోవిడ్ సంబంధిత సమస్యలపై అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓను పిలిచి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్, ముగ్గురు ట్రైనీ ఐఏఎస్లు చాలా అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.
కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జరిపే వీడియో కాన్ఫరెన్స్లపై కూడా అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, వివిధ రకాల యాప్లు డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని అసోపియేషన్ చీఫ్ సెక్రటరీ దృష్టికి తెచ్చింది. బ్లాక్ స్థాయి ఆఫీసర్లతో వారానికి రెండు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారని, 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే డాక్టర్లు కోవిడ్ పేషెంట్ల కోసం ఎక్కువ సమయం కేటాయించే వీలు ఉంటుందని తెలిపింది.
డాక్టర్లను కాస్త మర్యాదతో, గౌరవంతో చూస్తే కరోన పని ఒత్తిడి నుంచి వారు కాస్త ఉపశమనం పొందుతారని అసోసియేషన్ పేర్కొంది.