కానాయపల్లి శంకర సముద్రం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వనపర్తి జిల్లాకు చెందిన మంత్రి, దేవరకద్ర ఎమ్మెల్యే విఫలమయ్యారని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ విమర్శించారు.
శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష 2వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరానికి ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై కనీస సోయి లేకుండా వ్యవహరిస్తూ, తొమ్మిదేళ్లుగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా రైతులను తీవ్ర క్షోభ పెడుతున్నారని మండిపడ్డారు.
కాంట్రాక్టుల మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదని, త్వరలోనే ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఆధారాలతో బయటపెడతామన్నారు రెండు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని, రాచాల ఆరోగ్యానికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిపిఎం కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ కానాయపల్లి గ్రామంలో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్లాట్లు, ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇచ్చి, అంతేకాక సీ ఫామ్ డబ్బులు అందరికీ ఒకే విధంగా జమ చేయాలని డిమాండ్ చేశారు. బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సత్యం సాగర్ మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన సోషియో ఎకానామిక్ సర్వేలో గ్రామానికి చెందిన చాలా మంది లబ్ధిదారులు మిస్సయ్యారని…వారికి లబ్ది చేకూరేలా చూడాలని, పునరావాస కేంద్రంలో ప్లాట్ల కోసం చూపబడిన భూమి ఎత్తులు, తగ్గులతో ఇండ్ల నిర్మాణాలకు అనుకూలంగా లేదని, భూమిని చదును చేసి ఇవ్వాలన్నారు.
టిడిపి నాయకులు కిషన్ నాయక్ మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు నరోత్తమ్ రెడ్డి,బాజ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నిర్వాసితుల పేరు మీద మధ్యవర్తులు తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. ప్రభుత్వం వెంటనే 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని కోరారు. సాయంత్రం వైద్యులు రాచాలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలో పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్,స్వామి నాయుడు,భరత్ కుమార్, తిరుపతయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్, బోయేజ్, గొల్లబాబు, శేఖర్ రెడ్డి, సిఐటియు నిక్సన్, బిఎస్పీ నాయకుడు మాసన్న పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్