రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తూ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి 2023 న సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడపబడుతుంది. ఈ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. భారతీయ రైల్వే గర్వించదగ్గ రైలు సర్వీస్ – వందే భారత్ ఎక్స్ప్రెస్. మకర సంక్రాంతి శుభదినమైన 15 జనవరి 2023 నాడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తన రైలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు 16 జనవరి, 2023 నుండి ప్రారంభమవుతాయి.
దీని కోసం బుకింగ్లు 14 జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి. ట్రైన్ నంబర్ 20833 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 05.45 గంటలకు ప్రారంభమై 14.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నంబర్ 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం సికింద్రాబాద్ నుండి 15.00 గంటలకు బయలుదేరి 23.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ప్రధాన స్టేషన్ లు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్ లలో ఈ రైలు రెండు వైపులా ఆగుతుంది.
ఈ రైలులో 14 ఏ.సి చైర్ కార్ కోచ్లు, 1128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు ఎగ్జిక్యూటివ్ ఏ .సి చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. ఈ రైలు, రెండు స్టేషన్ల ( సికింద్రాబాద్ -విశాఖపట్నం ) మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రిజర్వ్డ్ సిట్టింగ్ వసతిని కలిగి ఉంటుంది. ఈ రైలు ఆధునిక ఫీచర్లు మరియు మెరుగైన సౌకర్యాలతో కూడిన స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడింది.
రైలు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను కలిగి ఉంది. అన్ని తరగతులలో ఏటవాలుగా ఆనుకొనే సౌకర్యవంతమైన సీట్లు, ఎగ్జిక్యూటివ్ తరగతిలో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు అమర్చబడి వున్నాయి. అత్యవసర అలారం బటన్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో మాట్లాడవచ్చు. భద్రమైన, సురక్షితమైన ప్రయాణానికి అన్ని కోచ్లలో ( నిఘా ) సి సి టివి కెమెరాలను అమర్చారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రజలకు సురక్షితమైన, అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పగటి సమయాల్లో అందిస్తుంది.